
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణానంతరం అతడి ఆస్తులను వారసులకు ఎలా పంచాలనేది తెలుపుతూ రాసే పత్రం. ముఖ్యంగా ఆస్తులు గలవారికి వీలునామా అనేది ఎస్టేట్ ప్లానింగ్లో కీలకమైన, చట్టపరమైన పత్రం.
వీలునామా ద్వారా ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన ఆస్తులను ఎలా పంపిణీ చేయాలనుకుంటున్నారో తెలియజేయొచ్చు. వీలునామా రాయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకరి చట్టపరమైన వారసుల హక్కులను రక్షించడంలో, ఆస్తి సంబంధిత వివాదాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఒక వ్యక్తికి అనేక మంది వారసులు ఉన్నట్లయితే వీలునామా రాయడం వల్ల సమస్యలు, సందేహాలను నివారించొచ్చు. వీలునామా లేని సందర్భంలో మానవ వైరుధ్యాల కారణంగా చట్టపరమైన పోరాటాలు, వివాదాలతో కుటుంబసభ్యుల మధ్య ఆస్తులకు సంబంధించి దీర్ఘకాలిక ఘర్షణలకు దారితీయొచ్చు.
ఇలాంటి పత్రాన్ని ఎలా రాయాలో, రాసేటప్పుడు ఎలాంటి విషయాలు గమనించాలో చూద్దాం!
ఎగ్జిక్యూటర్ నియామకం:
వీలునామాను రాసేటప్పుడు ఎగ్జిక్యూటర్ (కార్యనిర్వాహకుడి) నియమించడం కీలకమైంది. కార్యనిర్వాహకుడిగా వ్యవహరించడానికి ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండి ఆ పనిని ఇష్టపడే వ్యక్తిని ఎంచుకోవడం అత్యంత ముఖ్యమైనది. వీలునామాను అమలు చేసే వ్యక్తినే ఎగ్జిక్యూటర్ (కార్యనిర్వాహకుడు) అంటారు. కార్యనిర్వాహకుడి పేరు, వయసు, చిరునామాతో పాటు టెస్టేటర్ (వీలునామా తయారు చేసే వ్యక్తి)తో అతడి సంబంధం కూడా వీలునామాలో పేర్కొనాలి.
ఈ కార్యనిర్వాహకుడికి వీలునామా ప్రకారం ఆస్తులను వారసులకు పంపిణీ చేయడం వంటి బాధ్యతలు ఉంటాయి. ఈ ప్రక్రియను వీలునామా పరిపాలన అంటారు.
ఈ కార్యనిర్వాహకుడు టెస్టేటర్ కంటే చిన్నవారై ఉండడం చాలా మేలు. దీనివల్ల వీలునామాలో పేర్కొన్న అంశాలు అమల్లోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీలునామా రాసే వ్యక్తి అతడి మరణాంతరం రుణాలు, బాధ్యతలు, పన్నులు, రుసుములు మొదలైనవన్నీ చెల్లించాలని కార్యనిర్వాహకుడిని ఆదేశించొచ్చు.
వీలునామా రాసేటప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ముఖ్యమైన పని ఏంటంటే.. అతడి ఆస్తులు, అప్పుల జాబితాను రూపొందించుకోవాలి.
ఈ ఆస్తుల్లో నగదు, భూములు, భవనాలు, ఆభరణాలు, కుటుంబ వారసత్వ సంపదతో కూడిన విలువైన ఆస్తులు ఉండొచ్చు. బీమా, బ్యాంకు డిపాజిట్లు, స్టాక్స్/మ్యూచువల్ ఫండ్లు మొదలైన ఆస్తులను కూడా వీలునామాలో పేర్కొనొచ్చు.
మీ ఆస్తులను వారసత్వంగా పొందాలనుకుంటున్న వ్యక్తులను గుర్తించాలి. ఆస్తులు పొందే లబ్ధిదారుల విషయంలో స్పష్టత ఉండడం చాలా ముఖ్యం. లబ్ధిదారుల విషయంలో వ్యక్తులు లేదా సంస్థలు కూడా ఉండొచ్చు. వీలునామాలో నామినీగా పేర్కొనే వ్యక్తి సరైన వారసులకు ఆస్తులను పంచడంలో కీలక పాత్ర పోషిస్తాడు. వారసుడిని కూడా నామినీగా పేర్కొనొచ్చు. దీనివల్ల, వీలునామా రాసిన వ్యక్తి మరణం తర్వాత ఆస్తి బదిలీ సులభతరమైన ప్రక్రియగా మారుతుంది.
స్థిరాస్తులకు సంబంధించి ఆస్తుల నిర్వహణపై వారసుల మధ్య వివాదాలను నివారించడానికి తగిన శ్రద్ధ వహించాలి. ఆస్తులను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి ఉమ్మడిగా విడిచిపెట్టే బదులు నిర్దిష్ట ఆస్తులను నిర్దిష్ట వ్యక్తికి వీలునామాలో రాయడం తెలివైన పని.
వీలునామాకు సాక్షులు:
టెస్టేటర్ వీలునామాను రాసేటప్పుడు ఇద్దరు నమ్మకమైన సాక్షులను అక్కడ ఉండేలా చూసుకోవడం చాలా కీలకమైంది. వీలునామాను రాసే వ్యక్తి మంచి మనసు కలిగి ఉన్నాడని, అతడి సొంత స్వేచ్ఛా సంకల్పంతో, ఎవరి ప్రలోభాలకు గురికాకుండా వీలునామాను రాసినట్లు ఆ సాక్షులు ధ్రువీకరించవలసి ఉంటుంది. ఈ వ్యక్తులను అటెస్టింగ్ విట్నెస్ అంటారు. ముఖ్యంగా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే న్యాయవాదులు, డాక్లర్లు, CAలను అటెస్టింగ్ విట్నెస్గా పేర్కొనవచ్చు.
ఆ వీలునామాలో సాక్షులకు సంబంధించిన పేరు, చిరునామా, టెలిఫోన్ నంబర్ను పొందుపరచాలి. దీనివల్ల తర్వాత కాలంలో సాక్షులను కనుగొనడంలో వారసులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. వీలునామా రాసే వ్యక్తి పెద్ద వయసులో ఉన్నట్లయితే, రిజిస్టర్డ్ డాక్టర్ నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ను కలిగి ఉండడం మేలు. వీలునామా రాసిన వ్యక్తి మరణానికి ముందు ఎప్పుడైనా వీలునామాను మార్చవచ్చు లేదా రద్దు చేయొచ్చు.
చేతిరాత, వీడియోగ్రఫీ:
వీలునామాను తెల్లని పేపర్పై టైప్ చేయొచ్చు లేదా చేతితో రాయొచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఏదైనా కీలక పరిస్థితి తలెత్తినప్పుడు చేతితో వీలునామా రాయడం సురక్షితమైంది, ప్రామాణికమైంది. సంతకంతో పాటు వీలునామా తేదీ పేర్కొనడం చాలా ముఖ్యం. వీలునామా పత్రాలలో ప్రతి పేజీలో వీలునామా రాసే వ్యక్తి సంతకం చేయాలి. దిద్దుబాటు ఉన్నప్పుడు వీలునామా రాసే వ్యక్తితో పాటు సాక్షులు కూడా సంతకం చేయాలి.
వీలునామా నమోదు చేసేటప్పుడు వీడియోగ్రఫీ తీయించడం కూడా మంచిదే. వారసులు వీలునామాను సవాలు చేసే అవకాశం ఉందని టెస్టేటర్ భావించినట్లయితే వీడియో ఉండడం కూడా వీలునామాకు అదనపు బలం చేకూర్చేదే. ఇక్కడ టెస్టేటర్ స్వయంగా కెమెరా ముందు వీలునామాను చదవొచ్చు. ఇలాంటి చర్యలన్నీ భవిష్యత్తులో వీలునామాను ఎవరూ సవాలు చేయకుండా ఉపయోగ పడతాయి. అంతేకాకుండా వీలునామాను సులభంగా కనుగొనగలిగే ప్రదేశంలో ఉంచాలి. అలాగే ఒక కాపీని న్యాయ సలహాదారుల వద్ద ఉంచాలి.
వీలునామా నమోదు, ప్రయోజనాలు:
హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు తయారుజేసే వీలునామా భారతీయ వారసత్వ చట్టం, 1925లోని నిబంధనల ప్రకారం అమలు అవుతుంది.
వీలునామా రాసేటప్పడు న్యాయవాదిని సంప్రదించడం వల్ల భవిష్యత్తులో న్యాయపరంగా చిక్కుల్లేకుండా వీలునామా రూపొందుతుంది.
వీలునామాను రూపొందించిన తర్వాత, దాన్ని రిజిస్ట్రర్ ఆఫీస్లో నమోదు చేయడం ద్వారా, చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే కాపీని అందుకుంటారు. ఒకవేళ వీలునామా ఎప్పుడైనా ట్యాంపరింగ్కు గురయితే కాపీ కోసం రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించొచ్చు.
వీలునామాలో మైనర్ల పేరు ఉండొచ్చు. వీలునామా రాసే వ్యక్తికి మైనర్ పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నప్పుడు ఎవరు చూసుకుంటారు అనే దానిపై నిర్ణయాలు తీసుకోవడంలో వీలునామా సహాయపడుతుంది.
వారసులకు ఆస్తుల పంపిణీ గురించి చెప్పడంతో పాటు, ఒక వ్యక్తి తాము ఇష్టపడే స్వచ్ఛంద సంస్థలకు బహుమతులు, విరాళాలను ప్లాన్ చేసుకోవడానికి వీలునామా అనుమతిస్తుంది.